Wednesday, 7 December 2011

ఆదివాసుల అంతానికే పోలవరం ప్రాజెక్ట్

"ఆదివాసులకు స్వీయ నిర్ణయ హక్కు ఉంది "--ఐక్యరాజ్య సమితి ఆదివాసి హక్కుల ప్రకటన ...
పోలవరం కదిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో గత పక్షం రోజుల్లుగా చర్చోపచర్చలు చెలరేగుతున్నాయి.లాలుచి నిరుపిస్తామని ఒకరంటే దమ్ముంటే నిరుపించమని మరొకరు, ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తే సకలజనుల సమ్మెను ఆపినందుకు నజరానా అని మరికొందరు, త్వరలో పనిమొదలవుతుందని ప్రభుత్వం ప్రకటిస్తే న్యాయపోరాటమని కాంట్రాక్టర్లు ...వెరసి విషయమంతా అవినీతి, అర్హత అనర్హతల కేంద్రంగానే కొనసాగుతున్నది.అయితే పోలవరం(ఇందిరా సాగర్ ) ప్రాజెక్ట్ అంతకే పరిమితం కాదు. ఇందులో మానవహక్కులున్నాయి. ఆదివాసి హక్కులున్నాయి. అభివృద్ధి రాజకీయలున్నాయి.వాటి పేరిట జరిగే విధ్వంసాలున్నాయి.బహుళజాతి సంస్థల ప్రయోజనాలున్నాయి. ప్రశ్నార్థక మవుతున్న ప్రజాస్వామ్య విల్లువలున్నాయి.అందుకే ఇది నాగరిక ప్రజలు ఆలోచించవలసిన సమయం, స్పందించవలసిన సందర్భం.
కేంద్ర జలవనరుల శాఖ -1986లో తయారు చేసిన "గోదావరి సుజల సాగర డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ "ప్రకారం ఇది ఒక బహులార్థక సాధక ప్రాజెక్ట్ .దేశంలోని 2 .8 కోట్ల ఎకరాలలో చెరువులు, కుంటలు బావులు, బోర్లు ద్వార కేవలం 80 లక్షల ఎకరాలే సాగవుతున్న నేపద్యంలో(దేశవ్యాప్తంగా 22 .2 శాతం, యు.పి ౨౪, పంజాబ్ ౩౫ శాతం, కాగ ఏ.పి 14 శాతం మాత్రమె.).ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ పట్టణం, ఉభయ గోదావరి,కృష్ణ జిల్లాలలో 7 .21 లక్షల ఎకరాలలో సాగునీరు, విశాఖ పట్టణం స్టీల్ ప్లాంట్ మరియు పారిశ్రామిక సంస్థల అవసరాలకు 23 .44 టే.ఎం సి లు, కృష్ణానదికి 84 . 8 టే.ఎం సి ల నీటి మళ్లింపు 600 గ్రామాలకు తాగునీరే కాకుండా 960 మెగావాట్ల సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి ఇంకా అనేకానేక పథకాలతో సుమారు 2665 కోట్ల పెట్టుబడితో (నేడు 17 వేల కోట్లకు పైగా )36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ అంచనాతో పోలవరం, దేవిపట్టణంల మధ్య నిర్మించ తలపెట్ట బడింది.
ఈ ప్రాజెక్ట్ కారణంగా ఖమ్మం జిల్లా లోని వి ఆర్ పురంమండలం లో 45 గ్రామాలూ ,కూనవరం మండలంలో48 గ్రామాలు , చింతూర్లో 17 గ్రామాలు, భద్రాచలం లో 13 గ్రామాలు,బూర్గంపాడు లో 9 గ్రామాలు, కుకునూరు లో 34 గ్రామాలు, వేలెరుపాడులో 39 గ్రామాలు ముంపుకు గురి అవుతున్నాయి.అలాగే ప.గోదావరి జిల్లా పోలవరం మండలం లో 29 గ్రామాలు,తూ.గోదావరి దేవీపట్నం మండలం లో42 గ్రామాలు మునుగుతున్నాయి.ఒదిస్సా,చత్తీస్ గడ్ లలో వరుసగా 7 గ్రామాలు , 10 గ్రామాలు మునకకు గురి అవుతున్నాయి.
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ వలన 276 గ్రామాలు (వాస్తవంగా 350 గ్రామాలు ) లోని రెండులక్షల మంది (నేడు మూడు లక్షలు )ప్రజలు ,అందులో రెండు లక్షల మంది ఆదివాసులు నిర్వాసిత్వానికి , దాదాపు లక్ష ఎకరాల భూమి,637 చ,కి.మీ.విస్తీర్ణంలో షెద్యుల్డ్ ప్రాంతం,దాదాపు ఎనిమిది వేల రిజర్వు ఫారెస్ట్ జలసమాధికి గురి అవుతున్నాయి.అంతె కాక పేరంతాలపల్లి,శ్రీరామగిరి,భద్రాచలం లాంటి పర్యాటక పుణ్య స్థలాలు ఆదివాసుల నిత్యజీవితంలో ఆహారంగా ఉపయోగపడే దుంపలు,కాయలు, గడ్డలు,వేలాది ఔషధ మొక్కలు,ఆహారంగానే కాదు ఆదాయాన్నిచ్చే ఊరుమ్మడి చింతచెట్లు,తాటిచెట్లు,తాము దైవంగా భావించే ఇప్పచెట్లు(ఇప్పపూవు,సారా,వంటనూనె ),ఈతచెట్లు,వెదురు,కలప,జిగురు,కోట్లాదిరూపాయల బిజినెస్ అయిన బీడిఆకు మరియు భూమిలోని అత్యంత విలువైన ఖనిజ వనరులు జంతుజాలం...అన్నీ కనుమరుగు కానున్నాయి.
దేశంలోనే అత్యంత విధ్వంసకర అసమాన అభివృద్ధి కి నమూనాఐన పోలవరం ప్రాజెక్ట్ కు ఇప్పటివరకు చట్టపరంగా ఎటువంటి అనుమతులు లభించక పొయినా (కేవలం పేపర్ వర్క్ చేసుకోవచ్చని ఏప్రిల్ 25 , 2007 న సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది )నిర్మించాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే !ఈ దేశ రాజ్యాంగం ఆదివాసులకు ఎన్నో విధాలైన హక్కులు, రక్షణలు కల్పించింది.ఐక్యరాజ్య సమితి ఆదివాసీ హక్కుల ప్రకటన లో పేర్కొన్న - ఆదివాసులకు స్వీయనిర్ణయము లో భాగంగా వారి వ్యవహారాల విషయంలో స్వయంప్రతిపత్తి లేదా స్వయంపాలనా హక్కు ఉంది(ఆర్టికల్ 4 ), ఆదివాసీ హక్కులకు భంగం కలుగ చేసే విధానాలు,శాసనాలు అమలు చేసేముందు ప్రభుత్వం ఆదివాసులతో సంప్రదింపులు జరిపి అనుమతి పొందాలి(ఆర్టికల్19),ప్రజబిష్టం,ఆదివాసుల అనుమతి లేకుండా ఆదివాసీ ప్రాంతాలలో ఎటువంటి మిలిటరీ కార్యక్రమాలను నిర్వహించారాడు(ఆర్టికల్ 30 )-లాంటి అంశాలకు లోబడి ఉంటానని భారతదేశం ప్రకటించింది.భూముల పరాయికరణను నిరోధించేందుకు 1 /70 చట్టం,అటవీ సంరక్షణ చట్టం-1980 ,పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ,షెడ్యూల్డ్ ప్రాంతాల పంచాయితీరాజ్ చట్టం(పెసా)-1996 , అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 లాంటి పలు చట్టాలను రూపొందించింది.వీటి ద్వార గ్రామసభలకు అత్యున్నత అధికారాలు సంక్రమించాయి.తమ భవిష్యత్ ను తామే నిర్ణయించుకునే స్వేచ్చ లభించింది. మరి ఏ గ్రామ సభ అనుమతితో ఇంత దుర్మార్గమైన ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం సాహసిస్తుందో తెలుప గలదా ?ఒక్క అనుమతినైనా ప్రభుత్వం చట్టానికి లోబడి సంపాదించింద ?సైట్ క్లియరెన్స్ 19 సెప్టెంబర్ 2005 నాడు అనుమతి పొందినప్పటి నుండి పెట్టుబడులకు 25 ఫిబ్రవరి 2009 న,26 డిసెంబర్ 2009 (తెలంగాణా ఉద్యమం శిఖరాగ్ర స్థాయిలో ఉన్నపుడు)న అటవీశాఖ అనుమతులు పొందినప్పటి వరకు అన్ని వివిధ ప్రభుత్వ విభాగాలు ఇచ్చినవే కదా?
"అప్పట్లోనే కొన్ని పార్టీలు ప్రాజెక్ట్ ఫైవ్యతిరేక వ్యాఖ్యలు వినిపించినా...అన్నింటినీ సమాధాన పరచి ,ఎంత భారీవ్యయాన్నైన భరించడానికి సిద్దపడి ప్రాజెక్ట్ సత్వర నిర్మాణానికి ఆయన (వై.ఎస్.అర్)సంకల్పించారు."(చూ:సాక్షి,17 నవంబర్ 2010 ,౩వ పేజి ).వీటి అర్థం ఈరోజు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న వారికి సులభంగానే అర్థం అవుతుంది.
ఇప్పటికే రెండు పంటలు పండిస్తున్న కృష్ణా,ఉభయగోదావరి జిల్లాలకు మూడవ పంటకు నీటిని అందివ్వడానికి,బహుళజాతి కంపనీల,కాంట్రాక్టర్ల కమిషన్లకు లొంగి ఆదివాసీ ప్రాంతాలను,ప్రజలను అమానవీయంగా జలసమాధి చేయడానికి వ్యతిరేకంగా ముంపు ప్రాంతాలలో తీవ్రమైన ఉద్యమాలు ఎగిసాయి.తమ సాంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు,బాణాలు,గోడ్డండ్లతో నిరసన తెలిపారు."పోలవరం ప్రాజెక్ట్ గురించి సర్వే చేయడానికి వచ్చే అధికారులకు ప్రవేశం నిషిద్దం" అని పోస్టర్లు,బ్యానర్లు ప్రతి గూడెంలో పెట్టారు.కూనవరం మండలంలో కరకగూడెం గ్రమసభకు వెళ్ళిన బృందాన్ని ఐదు గంటలకు గదిలో నిర్భందించారు.ఎం.అర్.ఓ ,ఎం.పి.డి.ఓ లను ఘెరావ్ చేసారు.వేలాదిమంది ఆదివాసీలు ర్యాలీలు,ధర్నాలు,భారీ బహిరంగ సభల ద్వారా సమరభేరి మోగించారు.హక్కుల సంఘాలు,ఆదివాసీ,విద్యర్థిసంఘాలు,ప్రజా సంఘాలు,సామజిక,పర్యావరణ వేత్తలు,మేధావులు అందరూ పోలవరం ప్రాజెక్ట్ ను ప్రజా వ్యతిరేక ప్రాజెక్ట్ గా అభివర్ణిస్తూ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసారు.అయినా ప్ల్రభుత్వం లెక్కచేయకుండా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూనే ఉంది.గత కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల తవ్వకానికి సుమారు 3500 కోట్లను కాంట్రాక్టర్ల దోసిట్లో పోసి ప్రజల నోట్లో మన్ను గొట్టింది.ఉద్యమ ప్రాంతాలలో 144 సెక్షన్లు,అరెస్టులు,కాల్పులతో భాయోత్పాతలను సృష్టిస్తోంది.
గత కొంతకాలంగా తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతుంది.రేపో మాపో రాష్ట్రము ప్రకటిస్తారేమోననే ఊహాగానాలు వినబడుతున్నాయి.ఈ తరుణంలో సీమాంధ్రకాంగ్రెస్ ప్రభుత్వం,కాంట్రాక్టర్లు కుమ్మక్కై,తమ ప్రాంతానికి సిరులు పండించే పోలవరంప్రాజెక్ట్ ను సాధ్యమైనత త్వరగా పుర్తిచేసుకొనే కుట్రలో భాగంగానే నేడు రెండవదశ టెండర్ల ప్రక్రియ ను మొదలు పెట్టారు.4717 విలువైన నిర్మనపనులను చేజిక్కించుకోడానికి ఏడు స్థానిక,దేశీయ,విదేశీ సంస్థలు పోటి పడ్డాయి .ప్రాధమిక స్థాయిలోనే మూడు కంపనిలను అనర్హతకు గురికాగా,ప్రాంతీయ (తెలంగాణా )సంస్థ "స్యు-పటేల్-ఎఎమ్మార్ వెంచర్ " 12 .61 శాతం తక్కువకు మోసపూరితంగా టెండర్లను కోట్ చేసి పొందింది.ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం నిర్దేశించిన విలువకల పనులు చేయకున్నా,తప్పుడు అనుభవ సర్టిఫికేట్ ను సమర్పించి మోసపూరితంగా టెండర్లు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఒక పార్టీపై మరొక పార్టీ పోటి పడి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.తమతమ పార్టీలలోని కాంట్రాక్టర్ల తరుపున వకాల్త పుచ్చుకొని (పార్టీ ఫండ్ ఇవ్వరనేమో !)టెండర్ల అవినీతి,అక్రమాలపై రక్తి కట్టేలా నాటకాలడుతున్నాయి.తెలంగాణా రాష్ట్ర సాధన,వనరుల పరిరక్షణ పై నేడు అన్ని పార్టీ లు ప్రగల్భాలు పలుకుతున్నాయి.తెచ్చేది మేమే,ఇచ్చేది మేమే అని ఒక పార్టీ,అసలందు కొరకే పుట్టామని మరొక పార్టీ,మాకు రెండు ప్రాంతాలు సమానమే నని మరొక పార్టీ అంటున్నాయి కానీ ఎ ఒక్క పార్టీ పోలవరం ప్రాజెక్ట్ ను నిలిపివేయల్సిందే నని ఖచ్చితంగా మాట్లాడక పోగా కేవలం టెండర్ల రద్దు గురించే రచ్చ చేయడం దేనికి సూచన?నష్టపోతున్నది నోరులేని ఆదివాసులనేగా ఈ చులకన??
ఇది కేవలం టెండర్లకు,అవినీతికి మాత్రమే సంబంధించిన అంశం కాదు.ముందే అనుకున్నట్లు ఇది లక్షలాదిమంది ఆదివాసుల జీవన్మరణ సమస్య.భారత రాజ్యాంగం కల్పించిన గౌరవంగా జీవించే హక్కు సమస్య.ప్రజాస్వామిక విలువల సమస్య.అందుకే అభివృద్ధిని ఎవరు ఎలా నిర్వచిస్తున్నారో స్పష్టం కావలిసి ఉంది.ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణాలు,నగరాలకు మరింత సౌకర్యాలను కల్పించడానికి రోడ్లు,కరెంట్,తాగునీరు,విద్య,వైద్యంలాంటి కనీస సౌకర్యాలు కూడా లేని అదివాసిప్రాంతాలు,ప్రజలు ఎందుకు బలి కావాలో పాలకులు సంధనమివ్వవలసి ఉంది.వలస పాలనా కాలం నాటి చట్టాలకు మెరుగులు దిద్దుతూ భారతదేశం నయావలస దేశంగా మారి కోట్లాదిమంది ప్రజలను నిర్వాసితులను చేసే విధానాలను ప్రజాస్వామికవాదులు ప్రశ్నించవలసి ఉంది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అభివృద్ధి పేరిట నిర్వాసిత్వానికి గురైన వారిలో 40 శాతం ఆదివాసులు,18 . 96 శాతం అదివాసులే ఎందుకు ఉన్నారో మానవతావాదులు ఆలోచించాలి.ఇంత హటాత్తుగా
అడివాసిప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వాలు పడుతున్న ఆరాటం వెనుక కారణం వారి కాళ్ళ కింద ఉన్న లక్షల కోట్ల సంపదే కదా!
ఇప్పటికే ఆదివాసి సమాజం అల్లకల్లోలంగా ఉన్నది.లక్షలాదిమంది ఆదివాసులు ప్రభుత్వాలు సృష్టించిన "వారి వేలితోనే వారి కన్నును పొడిపించే సిద్దాంతంతో నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు.త్రాగడానికి మంచినీరు,జ్వరమొస్తే మందుబిల్ల దొరకనంత దయనియస్థితిలో బ్రతుకుతున్నారు.ఆఖరికి నగరవాసుల మానసికోల్లాసానికి ఉపయోగపడే "జూ"లోని జంతువుల పట్ల చూపే శ్రద్ద మాపైన లేదెందుకని నిలదీస్తున్నారు.ఇప్పుడు పోలవరం పేరు మీద నిర్వాసితుల్ని చేస్తే నగరాలలో "ఆదివాసి మానవ ప్రదర్శన శాల "లో తప్ప మరో విధంగా బ్రతుక లేమని ఆందోళన చెందుతున్నారు.ఆదివాసుల సంస్కృతీ ,ఉనికిని నాశనం చేసే ఫాసిస్టు విధానాల పట్ల భీతిల్లుతున్నారు.అందుకే ఆదివాసి జాతి అంతానికి కారణమయ్యే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆందరూ నిర్ద్వందంగా వ్యతిరేకించాలి.భారత రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు రక్షణలను అమలు చేసేలా ప్రభుత్వాలను ఒత్తిడి చేయవలసి ఉన్నది."అడవిపై హక్కు ఆదివాసులదే కానీ ప్రభుత్వాలది కాదు "అని నినదిద్దాం.ఆదివాసి ఉద్యమాలకు దన్నుగా నిలబడడం నాగరిక సమాజాల నైతిక భాద్యతగా గుర్తిద్దాం.రద్దు చేయవలసింది టెండర్లను కాదు పోలవరం ప్రాజెక్ట్ నని డిమాండ్ చేద్దాం.ప్రతిదానికి ఒక ఆరంభం ఉన్నట్లే అంతం కూడా ఉంటుంది.కదిలిన పోలవరం జల్,జంగల్,జమీన్ కొరకు పోరాడిన కొమరం భీమ్ స్పూర్తితో డిల్లీని తప్పక కదిలిస్తుంది.

జంజర్ల రమేష్ బాబు,కో కన్వీనర్
పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక ఐక్య పోరాట వేదిక

No comments:

Post a Comment